
ద్విచక్ర వాహనాలపై మనీ ఎక్ఛ్సేంజ్ దుకాణం వద్దకు వెళ్తారు. ఓ వ్యక్తి వాహనం పైనే ఉండి, దాన్ని ఆన్లోనే ఉంచి, పారిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. మరో వ్యక్తి చేతిలో నల్లటి పౌచ్తో దుకాణంలోకి వెళ్తాడు. తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీ దిమర్స్ను భారత కరెన్సీలోకి మార్చాల్సి ఉందంటూ ఆ సంస్థ నిర్వాహకుడికి చెప్తాడు. నల్లటి పౌచ్తో సహా అందులో ఉన్న దిరమ్స్ను సదరు నిర్వాహకుడికి అందిస్తాడు. తొలుత వాటిని బయటకు తీసి, సరిచూసే మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థ నిర్వాహకుడు ఆపై లెక్కిస్తాడు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ దిమర్స్ను భారత కరెన్సీలోకి మారుస్తూ విలువను క్యాలిక్యులేటర్లో లెక్కించి, కమీషన్ మినహాయించి చెప్తాడు. అతడు ఎంత చెప్పినా వెంటనే నిందితుడు అంగీకరిండు. అంత తక్కువ మొత్తం ఇస్తానంటే తాను దిమర్స్ను ఇవ్వనంటూ పౌచ్ తీసుకుంటాడు. దుకాణంలోకి వచ్చే ముందే పథకం ప్రకారం అలాంటి మరో పౌచ్లో దిమర్స్ కాకుండా వాటి కలర్ జిరాక్సు ప్రతులు తీసుకువస్తాడు. అసలు దిమర్స్ ఉన్న పౌచ్ను సంస్థ నిర్వాహకుడి నుంచి చేజిక్కించుకునే నిందితుడు ఆ మాట, ఈ మాట చెప్తూ అతడి దృష్టి మళ్ళిస్తాడు.
అదును చూసుకుని ఈ పౌచ్ను జేబులో పెట్టేసి, అందులోంచి కలర్ జిరాక్సు ప్రతులతో కూడిన పౌచ్ను చేతిలోకి తీసుకుని పట్టుకుంటాడు. కొద్దిసేపు సంస్థ నిర్వాహకుడితో సంభాషించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు అన్నట్లు నటిస్తూ అతడు చెప్పిన మొత్తానికే దిమర్స్ ఎక్ఛ్సేంజ్ చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలా దిరమ్స్ కలర్ జిరాక్సు ప్రతులతో కూడిన పౌచ్ను నిర్వాహకుడికి ఇచ్చేస్తాడు. అంతకు ముందే అసలు దిరమ్స్తో ఉన్న పౌచ్ను అందుకున్నప్పుడు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు ఈసారి కేవలం లోపల దిమర్స్ ఉన్నాయా? లేదా? అనే విషయం తప్ప మిగిలినవి పట్టించుకునే వారు కాదు. దీంతో ఆ విలువకు తగ్గ భారత్ కరెన్సీకి నిందితుడికి ఇచ్చేసేవాళ్ళు. ఈ నగదు చేతికి అందిన మరుక్షణమే దుకాణం నుంచి బయటకు వచ్చే నిందితుడు అప్పటికే ద్విచక్ర వాహనంపైసిద్ధంగా ఉన్న సహచరుడితో కలిసిక్షణాల్లో ఉడాయిస్తాడు... ఇదీ నలుగురు యువకులు కలిసి చేస్తున్న నయా మోసం.. బాధితులు తేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యి.. సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పంథాలో హైదరాబాద్, నిజామాబాద్ల్లో ఈ గ్యాంగ్ నాలుగు నేరాలు చేసింది. ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు వారి ఆట కట్టించారు.
మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థలతో పాటు ట్రావెల్స్ను టార్గెట్గా చేసుకుని, నిర్వాహకుల దృష్టి మళ్ళించడం ద్వారా ‘జిరాక్సు కరెన్సీ’ అంటగట్టి అందినకాడికి దండుకుంటున్న ముఠాకు హైదరాబాద్ ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. మొత్తం నలుగురు సభ్యులు ఉన్న ఈ గ్యాంగ్లో ఇద్దరిని పట్టుకుని రూ.1.6 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్లోని బండ్లగూడ సుభాన్కాలనీకి చెందిన మహ్మద్ సమీరుద్దీన్ అలియాస్ సమీర్ అలియాస్ అజ్జు.. కామారెడ్డిలోని రాజీవ్నగర్లో నివసిస్తూ వంటవాడిగా పని చేస్తున్నాడు. బోధన్కు చెందిన ఎలక్ట్రీషియన్ అబ్దుల్ రిజ్వాన్, కామారెడ్డికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఆరిఫ్, బిచ్కొండకు చెందిన ముజాహిద్ అలియాస్ మజ్జులతో ఇతడికి స్నేహం ఏర్పడింది. ఈ నలుగురూ కలిసి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థలను ఎంచుకున్నారు. వారిని మోసం చేసి డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. ఆ డబ్బుతో జల్సాలు చేయడం.. విచ్చలవిడిగా తిరగడం చేస్తున్నారు. పలు మనీ ఎక్ఛ్సేంజ్ సంస్థల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు నిఘా పెట్టి.. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.6 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, ఐదు సెల్ఫోన్లు, మోసాలు చేయడం కోసం నల్లరంగు పౌచ్ల్లో సిద్ధంగా ఉంచిన దిరమ్స్ కలర్ జిరాక్సు ప్రతులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముఠా సభ్యులు ఆరిఫ్, మజ్జు కోసం గాలిస్తున్నారు. ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కొరకు మా క్రైమ్ న్యూస్ పేజీ నీ వీక్షించండి.